Telangana: ప్రభుత్వం వైపు కన్నా.. ప్రజల వైపు ఉండటం నా ధోరణి : విజయశాంతి

  • తిరుగుబాటు స్వభావపు సినిమా పాత్రల ప్రేరణే కావొచ్చన్న కాంగ్రెస్ నేత
  • కొందరు విమర్శించినా ఎందుకో ఇదే ధోరణిలో ముందుకు సాగుతున్నట్టు వెల్లడి
  • లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని ఆశిస్తున్నానన్న విజయశాంతి
Iam wishing to Telangana Congress government to fulfill the hopes of the people says Vijayashanti

ప్రభుత్వం వైపు కన్నా.. ప్రజల వైపు ఉండటం తన ధోరణి అని కాంగ్రెస్ నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. తిరుగుబాటు స్వభావపు సినిమా పాత్రల ప్రేరణే బహుశా అందుకు కారణం కావొచ్చని అన్నారు. కొంతమంది విమర్శించినా ఎందుకో అదే విధానం తనను అట్లా ముందుకు నడిపిస్తూనే వస్తోందని విజయశాంతి చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నంత పోరాట స్ఫూర్తి, స్వేచ్ఛ అధికారపక్షంలో సాధ్యపడకపోవడం కూడా ఒక వాస్తవమేమోనని ఆమె అన్నారు. ‘26వ సంవత్సరాల రాజకీయ గమనంలో’.. అంటూ ఎక్స్  వేదికగా ఈ మేరకు విజయశాంతి స్పందించారు.

తాను గెలిపించడానికి పనిచేసిన నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశలను నెరవేర్చే సాఫల్యతను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆ పార్టీ నేత విజయశాంతి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రివర్గం ప్రజల కోసం ఆ దిశగా ఇప్పటికే పనిచేస్తున్నారని, అమలు ప్రారంభమైన హామీలు దశలవారీగా పూర్తిస్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ కార్యాచరణ‌ విజయం దిశగా సాగాలని తన అభిప్రాయమని ఆమె పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగలదని విశ్వసిస్తున్నానని ఆమె అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు.

More Telugu News